
PDF Version ఇక్కడ డౌన్లోడ్ చేసుకొనండి Click Here
mp3 file ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని వినండి. ఇక్కడ క్లిక్ చేయండి.
“కాబట్టి
అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి
విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి”
(కొలస్సీ 2:16).
మరి
ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము
క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను (అపొ 4:12).
అదేమనగా,
యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు
మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు
రక్షింపబడుదువు (రోమా
10:9).
కాబట్టి
అన్యజనులలోనుండి దేవునివైపు తిరుగుచున్నవారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన
అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి
చంపినదానిని, రక్తమును విసర్జించుటకు
వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము (అపొ 15:19).
విషయసూచిక
ముందుమాట
1. సియోను సంఘ
ఆవిర్భావం
2. క్రైస్తవులు
శనివారపు ఆరాధన (సబ్బాతు దినము) పాటించాలా?
3. రక్షణ ఎలా
వస్తుంది: క్రియల వలనా? విశ్వాసము వలనా?
4. క్రీస్తు ధర్మశాస్త్రం
ఏమిటి?
5. రెండవ రాకడ
జరిగిపోయిందా? రక్షకుడు మళ్ళీ పుట్టాడా?
6. పరలోకంలో తల్లి
ఉందా?
7. పరిశుద్ధాత్మ
పేరు- రహస్య నామం
8. మీరు
తీసుకోవలసిన జాగ్రత్తలు
ముందుమాట
ప్రభువునందు
ప్రియమైన పాఠకులకు శుభములు. ఈ మధ్యకాలంలో నాకు తారసపడిన ఒక అబద్ధ బోధకుల గుంపు (cult)
గురించి క్రైస్తవ సమాజంలో అవగాహన తీసుకురావాలనే తాపత్రయంతో ఈ చిన్న
పుస్తకం వ్రాస్తున్నాను. చర్చిల బయట లేదా రోడ్లమీద నిలబడి క్రైస్తవులని తెలిస్తే
వారికి సత్యం చెబుతామంటూ వారికి మోసకరమైన మాటలు చెప్పి వారిని బలవంతంగా విశ్వాసంలోనుండి
తొలగించే ప్రయత్నం చేస్తున్న ఒక గుంపు “సియోను సంఘం”. ఈ పేరుతో మనలో చాలా సంఘాలు
ఇప్పటికే ఉన్నాయి కానీ నేను వాటి గురించి మాట్లాడటం లేదు. నేను చెప్పబోయే ఈ సంఘంవారు
ప్రాముఖ్యంగా- ఆదివారం ఆరాధన చేయకూడదని, విశ్రాంతి (సబ్బాతు) దినం శనివారము కనుక ఆ
రోజు మాత్రమే ఆరాధన చేయాలని, లేకపోతే పరలోకానికి వెళ్ళమని బోధిస్తున్నారు. సబ్బాతు
పేరు చెప్పి బైబిల్ విరుద్ధమైన దుర్బోధలెన్నో చేస్తూ వీరు విశ్వాసులను తప్పు త్రోవలో
నడిపిస్తున్నారు. ఈ విషయాన్ని నేను ఇంత సీరియస్ గా తీసుకోవడానికి కారణం- వారు
బోధించే మరిన్ని భయంకరమైన విషయాలు వాక్య అవగాహన లేనివారిని తికమక పెట్టేవిగా
ఉంటున్నాయి. ఉదాహరణకు: అహన్ సంగ్ హాంగ్ (Ahn Sahng-hong) అనే వ్యక్తి
పరిశుద్ధాత్మ దేవుడని, యేసే ఆయన రూపంలో రెండవ రాకడగా కొరియాలో జన్మించాడని వీరు
బోధిస్తున్నారు. తండ్రియైన దేవుడే కాదు తల్లియైన దేవుడు కూడా ఉందని, ఆమె సియోను
తల్లి అని, ఆమె కొరియా దేశంలో ఉందని చెబుతారు. ఈ సంఘంవారు ప్రత్యేకించి
క్రైస్తవులనే గురిగా పెట్టుకొని పనిచేస్తున్నారు.
పైన
చెప్పబడిన విషయాలు ఇంకా అనేకం బోధిస్తారు కానీ, అన్నీ ఒక్కసారే చెప్పరు. ఒక్కొక్క
విషయాన్ని ఎదుటి వ్యక్తిని అంచనా వేస్తూ చెబుతారు. అందుకే చాలా మంది
విశ్వాసంలోనుండి తొలగిపోతున్నారు.
దయచేసి
సంఘకాపరులు మరియు నాయకులు కొంత సమయం కేటాయించి ఈ పుస్తకాన్ని చదవండి, మీ
విశ్వాసులతో చదివించండి, బైబిల్ స్టడీస్ లో ఈ విషయం చర్చించి మీ విశ్వాసులను
బలోపితం చేసుకోండి. మన సంఘాలలో శాఖాబేధాలు లేకుండా ఈ ఉద్యమంలో పాల్గొని ఏ ఒక్క
ఆత్మను కోల్పోకుండా ఉంటారని ఆశిస్తూ...
ప్రభువు సేవలో
పాస్టర్ ప్రేమ్ కుమార్ హవాజి
1. సియోను సంఘ ఆవిర్భావం
సంఘ స్థాపకుడు: అహన్ సంగ్ హాంగ్ (Ahn Sahng-hong)
1918లో దక్షిణకొరియా దేశంలో ఒక బౌద్ధ కుటుంబంలో జన్మించాడు. కొంతకాలానికి
యేసుక్రీస్తు గురించి తెలుసుకొని శనివారమే ఆరాధన చేయాలని బోధించే Seventh-day
Adventist Church అనే
సంఘంలో సభ్యుడయ్యాడు. 1956లో తాను దేవుని ప్రత్యక్షత పొందానని, రానున్న 10
సంవత్సరాలలో యేసు ప్రభువు తిరిగి రాబోతున్నాడని ప్రవచించాడు. 1958లో Hwang
Wonsun అనే ఆమెను పెండ్లి చేసుకుని ముగ్గురు పిల్లల్ని కన్నాడు. అతడు
మరెన్నో వింత బోధలు చేయడాన్నిబట్టి 1963లో
Seventh-day Adventist Church అతడిని సంఘంలోనుండి వెలివేసింది. అప్పుడు 23
మందితో కలసి సంఘంలోనుండి విడిపోయి Witnesses of Jesus Church of God అనే
సంఘాన్ని స్థాపించాడు. అతడు 1985లో గుండెపోటుతో చనిపోయాడు. అతని మరణానంతరం ఈ సంఘం
రెండుగా విడిపోవడంతో, New Covenant Passover Church of God అనే
సంస్థ ఉనికిలోనికి వచ్చింది. దీనినే ఇప్పుడు వారు World Mission Society
Church of God అని పిలుస్తారు. వారి సంఘాలను సియోను సంఘం అని కూడా
పిలుచుకుంటారు.
సియోను
సంఘంవారు ఉపయోగించే పద్ధతులు:
·
భయపెట్టుట: వారి
బోధలను వినకపోతే నరకానికి వెళ్లిపోతామని భయపెట్టేస్తారు. భయం వారి ఆయుధం. అమాయక
క్రైస్తవులనే గురిగా పెట్టుకుని వారిని మాయలో పడేస్తారు. సంవత్సరానికి ఒక్కసారి
పస్కాను ఆచరించకుండా తరచుగా ప్రభువు బల్లను సమీపిస్తే, పరలోకంలో ఉన్న తల్లిని
పూజించకపోతే, సియోను సంఘ బాప్తిస్మం అహన్ సంగ్ హాంగ్ నామంలో పొందకపోతే, శనివారం
ఆరాధన చేయకపోతే దేవుని ఉగ్రత మనపైకి వస్తుందని భయపెట్టేస్తారు.
· వాక్య వక్రీకరణ: వారి
బోధలను నిరూపించడానికి ఉపయోగించే బైబిల్ వచనాలను సందర్భంతో సంబంధం లేకుండా అర్థాన్ని మార్చి ఉన్నవి లేనట్లు లేనివి
ఉన్నట్లు చూపిస్తారు. లేదా ఆ మాటను అలాగే విడిచిపెట్టి వారి వాదనకు ఉపయోగపడే వేరే వచనాల
అర్థాలు మార్చి మనకు చెబుతారు. ఆ వచనాలను మనం సరిగ్గా పరిశీలిస్తే అందులో వీరు
చెప్పేది ఎక్కడా ఉండదు. దేవుని గ్రంథంలో ఏమి కలుపుకూడదని, అలా చేస్తే తెగుళ్ళు
వస్తాయని మనల్ని భయపెడతారు కానీ వారు మాత్రం నచ్చినట్లు కలిపేస్తుంటారు.
·
గోప్యత: వారి
బోధ అంతా ఒక్కసారిగా చెప్పరు. సమాచారాన్ని గోప్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు.
ముందు వారి సబ్బాతు ఆరాధన నమ్మేలా మనలను మార్చి అప్పుడు మిగిలిన విషయాలు మెల్లగా
బోధిస్తారు.
· ఆప్యాయత: మీరు
నరకానికి వెళ్ళిపోతారు, అది నేను చూస్తూ పరలోకంలో సంతోషంగా ఉండలేను, అర్జెంటుగా
బాప్తిస్మం తీసుకోండి అంటూ తొందర పెడతారు. చిన్న పిల్లలకు కూడా బాప్తిస్మం
ఇచ్చేయాలంటారు.
2. క్రైస్తవులు శనివారపు ఆరాధన (సబ్బాతు దినము)
పాటించాలా?
సియోను సంఘ బోధ:
దేవుడు
ఈ లోకాన్ని ఆరు దినాలలో చేసి ఏడవ దినాన విశ్రాంతి తీసుకుని దానిని పరిశుద్ధ పరిచి
(ఆది 2:3) దానిని 10 ఆజ్ఞలలో పొందుపరచారు (నిర్గమ 20:8-10). సబ్బాతు అచరించాలని దేవుడు సర్వ సృష్టితో నిత్య
నిబంధన చేసుకున్నారు (నిర్గ 31:17). యేసు క్రీస్తు సబ్బాతును ఆచరించారు కానీ
దానిని సుళువు పరిచారు కనుక మనం కూడా ఆ సుళువైన సబ్బాతును ఆచరించాలి, లేకపోతే
పరలోకానికి వెళ్ళం. అపొస్తలుడైన పౌలు సబ్బాతును ఆచరించాడు. యాకోబు 2వ అధ్యాయంలో
వ్రాయబడినట్లు “క్రియలు లేని విశ్వాసం మృతము” కనుక “సబ్బాతు ఆరాధన” వంటి క్రియలను
పాటించాలి. లేవీయకాండము 23లో చెప్పబడిన ఏడు పండుగలు ఆచరించాలి.
బైబిల్ బోధ:
విశ్రాంతి
దినం మనకు-దేవునికి మధ్య నిబంధన కాదు: దేవుడు ఏడవ దినాన్ని విశ్రాంతి దినంగా
ప్రకటించిన మాట నిజమే. కానీ, అది సర్వ సృష్టికి ఇచ్చిన ఆజ్ఞ అని ఆ వచనంలో లేదు.
మోషే ధర్మశాస్త్రం వచ్చే వరకు అబ్రాహాముతో సహా ఏ ఒక్కరు ఈ ఆజ్ఞను పాటించినట్లు
బైబిల్ బోధించటంలేదు. అది ఇశ్రాయేలీయులకు నిబంధనగా ఇవ్వబడింది నిజమే కాని మనకు కాదు (నిర్గ 31:17; యేహెజ్కేలు
20:12; నిర్గమ 31:13). మనం ఇశ్రాయేలీయులం కాదు గదా! సబ్బాతు అన్యులకు కూడా
నిబంధనైతే, ఇశ్రాయేలీయులకు దేవునికిని మధ్య అది ఒక ప్రత్యేకమైన నిబంధనగా
ఎలా ఉంటుంది? అలాగే, పై వచనంలో “ఎల్లప్పుడు” అన్న మాటను “నిత్య నిబంధన” అని సియోను
సంఘం బోధిస్తుంది. కానీ, సువార్త సారాన్ని అర్థం చేసుకుంటే, ఇశ్రాయేలీయులు సహితం క్రీస్తు
రక్తము వలననైన క్రొత్త నిబంధనలోనికి ప్రవేశించినప్పుడు (1కొరింథీ 11: 25), పాత
నిబంధనకు సబంధించిన ధర్మశాస్త్రము నివారణ చేయబడుతుంది.
ఆ
ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణసిద్ధి కలుగజేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను
నిష్ప్రయోజన మైనందునను అది నివారణ చేయబడియున్నది; అంత కంటె శ్రేష్ఠమైన నిరీక్షణ
దానివెంట ప్రవేశపెట్టబడెను. దీనిద్వారా, దేవునియొద్దకు మనము చేరుచున్నాము (హెబ్రీ 7:18-19).
యేసు
వాడుకలన్నీ మనం చేయనవసరం లేదు: ప్రభువైన యేసు కూడా విశ్రాంతి దినమును “వాడుక
చొప్పున” ఆచరించారని (లూకా 4:16), ఆయన ఆజ్ఞాపించినవన్నీ మనం పాటించాలని సియోను
సంఘం బోధిస్తుంది (మత్తయి 28:20). ఒక యూదునిగా ప్రభువైన యేసు చేసిన ఆచారాలను మనం
పాటించనవసరం లేదు. అందుకే, క్రొత్త నిబంధనలో ఏ ఒక్క వచనంలో మనం సబ్బాతు అచరించాలని
యేసు అజ్ఞాపించినట్లు కనిపించదు. ఎందుకంటే, ధర్మశాస్త్రమును నెరవేర్చుట ద్వారా,
దానిని నివారణ చేసి మనలను నూతన నిబంధనలోనికి ఆయన ప్రవేశపెట్టియున్నారు.
యేసు
ఇచ్చిన ఆజ్ఞలు: మీరు పది ఆజ్ఞలు పాటిస్తున్నారు కానీ విశ్రాంతి
దినం ఎందుకు పాటించటం లేదు అని సియోను సంఘపువారు అంటారు. మనం పది ఆజ్ఞలు బోధించే భావాలను
తప్పనిసరిగా పాటిస్తున్నాం. ఉదాహరణకు: తొమ్మిదవ ఆజ్ఞ- నీ పొరుగువానిమీద
అబద్ధసాక్ష్యము పలుకకూడదు. ఇది ఒక కోర్టు సన్నివేశంలో ఉపయోగించే ఆజ్ఞ.
ఇక్కడ మనం అబద్ధం ఆడకూడదు అని లేదు. పొరుగువాని మీద అబద్ధం చెప్పకూడదు అని ఉంది.
మరి మనం అబద్ధం ఎందుకు ఆడటంలేదు? ఈ ఆజ్ఞలో ఉన్న అంతరార్థాన్ని పరిగణలోనికి
తీసుకుంటున్నాం కాబట్టి మనం అబద్ధం చెప్పం. ఒక్క మాటలో చెప్పాలంటే, మనం పాటించేది,
యేసు చెప్పిన పది ఆజ్ఞల సారాంశం:
నీవు
నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ
పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ
దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది,
నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలె ననునది రెండవ ఆజ్ఞ;
వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతనితో చెప్పెను (మార్కు
12:30-31).
ఆది
అపొస్తలలు ఆదివారం సంఘముగా కూడుకున్నారు: మనం
ఆదివారం సంఘముగా కూడుకొని విశ్రాంతి దినమును ఆత్మీయ విధానంలో ఆచరిస్తున్నాము. ఆది
సంఘం ప్రతి దినం, మరి ప్రత్యేకముగా ఆదివారమున కూడినట్లు మనం చూడగలం:
·
మరియు
వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు,
ప్రజలందరివలన దయపొందినవారై... (అపొస్తలులు 2:46).
·
ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి,
వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను (అపొస్తలులు 20:7).
·
నేను
వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆది వారమున మీలో ప్రతివాడును తాను
వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను (1కొరింథీ 16:2).
పౌలు విశ్రాంతి
దినము ఆచరించనవసరం లేదని చెప్పాడు: పౌలు “వాడుక చొప్పున” (అపొ 17:2) విశ్రాంతి
దినమున సమాజమందిరాలలో తర్కించినట్లు బైబిల్లో కొన్ని చోట్ల కనిపిస్తుంది.
అతడు
ప్రతి విశ్రాంతిదినమున సమాజమందిరములో తర్కించుచు, యూదులను గ్రీసు దేశస్థులను
ఒప్పించుచు నుండెను
(అపొ 18:4).
దాని
అర్థం అతడు విశ్రాంతి దినం పాటించినట్లు కాదు. అతడు కేవలం విశ్రాంతి దినమున యూదులు
సమాజ మందిరాలలో కూడుకుంటారు కనుక వారికి సువార్తను ప్రకటించడానికి “వాడుక చొప్పున”
అక్కడికి వెళ్ళే వాడు. అతడు తన పత్రికలలో విశ్రాంతి దినమును ఆచరించాలని ఎక్కడా ప్రస్తావించ
లేదు గాని, “ఆదివారము” గురించి మాత్రమే మాట్లాడాడు.
అంతే
కాదు, సబ్బాతు విషయంలో మనలను ప్రశ్నించే అవకాశం ఎవ్వరికి యివ్వకూడదని పౌలు బోధించాడు:
కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి షయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి. ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది (కొలస్సీ 2:16-17).
ఆ మాటకొస్తే, అన్యులలోనుండి ప్రభువును
నమ్మిన వారు ఏమేమి పాటించాలి అనే వాదన వచ్చినప్పుడు శిష్యులు నిర్ణయించిన కొన్ని
ప్రాముఖ్యమైన విషయాల్లో విశ్రాంతి దినం లేనేలేదు:
కాబట్టి అన్యజనులలోనుండి దేవునివైపు తిరుగుచున్నవారిని మనము కష్టపెట్టక 20 విగ్రహ సంబంధమైన అపవిత్రతను,
జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని,
రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము
(అపొ 15:19).
నిత్య
విశ్రాంతి సబ్బాతును పాటించుట వలన వచ్చేది కాదు:
హెబ్రీయులకు 4:1-11లోని వచనాలను చూపించి, మనం విశ్రాంతి దినం ఆచరించాలి అని సియోను
సంఘంవారు చెబుతారు. దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధన మరియు దానికి సంబంధించిన
ధర్మశాస్త్ర నియమాలు క్రీస్తును సూచిస్తున్నాయని, మనం శ్రేష్టమైన నిరీక్షణలో
ఉన్నామని చెప్పటానికే అసలు ఈ పత్రిక వ్రాయబడింది. ఈ నేపధ్యంలో పై వచనాలను చదివితే,
విశ్వాస విషయంలో అవిధేయులై పలుమార్లు దేవునిని విసిగించినందున ఇశ్రాయేలీయులు
విశ్రాంతిలోనికి (కనానులోనికి) ప్రవేశింప లేకపోయారని మనకు అర్థం అవుతుంది. ఆ
విశ్రాంతి నిజమైన, రాబోవు నిత్య విశ్రాంతిని సూచిస్తుందని, కనుక ఈ నిత్య విశ్రాంతి
పొందాలంటే క్రీస్తునందు విశ్వాసముంచాలని అర్థమౌతుంది. కనుక సియోను సంఘం వారు
బోధించే విశ్రాంతి దినం మనలను తిరిగి పాత నిబంధనలోనికే తీసుకువెళ్తుంది కానీ
మెరుగైన నూతన నిబంధనలోనికి కాదు.
యూదుల
పండుగలు మనం ఆచరించనవసరం లేదు: యూదుల పండుగలు క్రీస్తులోని విమోచన మరియు
దీవెనను చూపిస్తున్నాయి. క్రీస్తులో ఉన్న మనం అటువంటి పండుగలు ఆచరించనవసరంలేదని
కొలస్సీ 2:16-17లో స్పష్టంగా చెప్పబడింది.
3. రక్షణ ఎలా వస్తుంది: క్రియల వలనా? విశ్వాసము
వలనా?
సియోను సంఘ బోధ:
క్రియలు లేని విశ్వాసం మృతము కనుక మనం విశ్రాంతి
దినం మరియు పాత నిబంధనలోని ఏడు పండుగలు ఆచరించాలి.
బైబిల్ బోధ:
విశ్వాసము
వలననే మనకు రక్షణ: విశ్వాసము మరియు దేవుని కృప మూలంగానే మనకు రక్షణ లభిస్తుందని
బైబిల్ స్పష్టంగా చెబుతుంది. ధర్మ శాస్త్ర సంబంధమైన క్రియలు మనలను నీతిమంతులుగా
తీర్చలేవు.
మీరు
విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది
మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన
కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు
(ఎఫెసీ 2:8-9).
ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు;
ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది.
ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి
బయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.
అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై,నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది
(రోమా 3:20-22).
ఈ
విషయం చెబితే, సియోను సంఘంవారు యాకోబు 2:14 చూపిస్తారు: నా
సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని
చెప్పినయెడల ఏమి ప్రయోజనము? అట్టి
విశ్వాసమతని రక్షింపగలదా?
ఇక్కడ ఒక్క
విషయం మనం గమనించాలి. యాకోబు పత్రిక మొత్తంలో ఎక్కడా ధర్మశాస్త్ర సంబంధమైన
క్రియలను గూర్చి మాట్లాడటం లేదు. కనుక విశ్రాంతి దినం ప్రసక్తి అసలే లేదు. ఇకపోతే,
క్రియల వలన మనం రక్షించబడతామని కూడా ఈ పత్రికలో లేదు. పౌలు బోధించిన ‘విశ్వాసమూలంగా
రక్షణ’కు, యాకోబు మాట్లాడే ‘క్రియలతో కూడిన విశ్వాసా’నికి ఉన్న సంబంధం
ఒక్కటే: నీవు క్రీస్తునందు విశ్వసిస్తున్నానని చెబితే అది క్రియలలో చూపించు.
అప్పుడు అది నిజంగా నీవు క్రీస్తు శిష్యుడవని రుజువు చేస్తుంది. అంతేగాని
విశ్రాంతి దినం, యూదుల పండుగలు అచరించాలని ఈ వచనాలు చెప్పడం లేదు.
పాపమెట్టిదో
తెలియజేయడానికి మోషే ధర్మశాస్త్రము బాలశిక్షకునిగా మనకు ఇవ్వబడింది (గలతీ 3:21), యేసు
దానిని నెరవేర్చుట ద్వారా అది కొట్టివేయబడింది (2కొరింథీ 3:14-16) కనుక మోషే
ధర్మశాస్త్ర కాడి క్రింద మనం లేము (గలతీ 3:24; గలతీ 5:1). ధర్మశాస్త్రం మనలను
నీతిమంతులుగా తీర్చలేదు గాని విశ్వాసమే మనలను జీవింప చేస్తుంది కనుక (గలతీ 3:11)
మోషే ధర్మశాస్త్రం మనం పాటించనవసరంలేదు. మన క్రియలు మనలను రక్షించలేవు.
4. క్రీస్తు ధర్మశాస్త్రం ఏమిటి?
సియోను సంఘ బోధ:
యేసు
మోషే ధర్మశాస్త్రమును సుళువు పరచి “క్రీస్తు ధర్మశాస్త్రం”గా అనుగ్రహించారు. అది
మనం పాటిస్తేనే పరలోకం.
బైబిల్ బోధ:
“క్రీస్తు
ధర్మశాస్త్రం” అనే పేరు బైబిల్లో ఎక్కడా లేదు:
దీనికి వీరు ఉపయోగించే రెండు వచనాలు గలతీ 6:2 మరియు 1 కొరింథీ 9:21. మోషే ధర్మ
శాస్త్రాన్ని సుళువు పరచి మార్పులు చేర్పులు చేసి మనకు క్రీస్తు తన ధర్మశాస్త్రంగా
ఇచ్చారని ఈ వచనాలలో ఎక్కడా చెప్పబడలేదు. మొదటి వచనంలో ‘క్రీస్తు నియమము’ అను పదము
వాడబడింది. గలతీ పత్రిక అంతా చదివితే ‘క్రీస్తు నియమం’ “ప్రేమ” అని, అది సబ్బాతు
గురించి మాట్లాడుటలేదని, అసలు మోషే ధర్మ శాస్త్రంలోని ఆచారాలకు క్రీస్తు నియమానికి
ఎటువంటి సంబంధం లేదని (రోమా 3:20-22) మనకు సుళువుగా అర్థం అవుతుంది. 1కొరింథీ 9:21లో కూడా క్రీస్తు ధర్మశాస్తం
గురించి ఏమియు చెప్పుటలేదు. మోషే ధర్మశాస్త్రం పాటించని పౌలు మోషే ధర్మశాస్త్రం
పాటించే వారిని క్రీస్తు కొరకు సంపాదించుటకు మోషే ధర్మ శాస్త్రం ఉన్నవాని వలె
జీవించాడని దీని అర్థం. అంతే కాని ఇది సబ్బాతుకు సంబంధించిన వచనం కానే కాదు. ఆ
అధ్యాయం అంతా చదవండి. వాక్యాన్ని వక్రీకరించి వారికి అనుగుణంగా మార్చుకోవడంలో
దిట్టయైన సియోను సంఘం వారు దీనికి కూడా అర్థాన్ని మార్చగలరు. మీకు మీరుగా దీనిని
ఆలోచించండి. మోసపోకండి.
5. రెండవ రాకడ జరిగిపోయిందా? రక్షకుడు మళ్ళీ
పుట్టాడా?
సియోను సంఘ బోధ:
తండ్రియైన
దేవుడే కుమారుడైన యేసుగా ఈ లోకానికి వచ్చాడు (హెబ్రీ 9:28). కుమారుడైన యేసే
పరిశుద్ధాత్మగా మారి 1918లో దక్షిణకొరియా దేశంలో మన రక్షణ సంపూర్ణం చేయడానికి అహన్
సంగ్ హాంగ్ (Ahn Sahng-hong) అనే పేరుతో రెండవ రాకడగా వచ్చాడు. తూర్పునుండి
వచ్చే క్రూర పక్షి ఈయనే (యెషయా 46:10-11). దేవుడే ఈ పక్షిరాజు (ద్వితీ 32:11).
బైబిల్ బోధ:
తండ్రి,
కుమార, పరిశుద్ధాత్మ దైవత్రిత్వములోని వేర్వేరు వ్యక్తులు:
మత్తయి 28:18-20 ప్రకారం, మనం తండ్రి, కుమార, మరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిస్మం
పొందితే చాలు. తండ్రి కుమార
పరిశుద్ధాత్మలు దైవ త్రిత్వములో ముగ్గురు వేర్వేరు వ్యక్తులని చెప్పుటకు బైబిల్లో
అనేక ఆధారాలున్నాయి. అందులో ప్రధానమైనది మత్తయి 28:19-20. ఇంకా చెప్పాలంటే, యెహోవాయే
యేసుగా జన్మిస్తే, తండ్రిగా యెహోవా ఉనికిలో లేనట్లే కదా! మరి యేసును ఈ లోకానికి
ఎవరు పంపారు (యోహాను 8:29)? ఈయన నా ప్రియ కుమారుడని యేసు గురించి ఎవరు చెప్పారు
(మత్తయి 3:13-17)? నా తండ్రి చిత్తాన్నే జరిగిస్తానని యేసు ఎవరి గురించి చెప్పారు
(యోహాను 6:39)? యేసు ఎవరికి ప్రార్థించారు (మత్తయి 26:39; లూకా 23:34)? యేసు తన
ఆత్మను ఎవరికి అప్పగించారు (లూకా 23:46)? ఆయనను మృతులలోనుండి ఎవరు లేపారు (రోమా
8:11)? ప్రస్తుతం యేసు మనకొరకు ఎవరికి విజ్ఞాపన చేస్తున్నారు? తండ్రి కుమారులు
ఒక్కరే అంటే తన ప్రక్కన తానే కూర్చున్నారా (రోమా 8:34)?
యేసు
రెండవ రాకడ ఇంకా జరగలేదు: సియోను సంఘంవారు తమ అబద్ధ బోధను
నిరూపించుకోవడానికి ఉపయోగించిన పై వచనలన్నీ వక్రీకరించబడినవే! మొదటిసారి క్రీస్తు
వచ్చినప్పుడు పాప భారమును మోసి ధర్మశాస్త్రము మనపై మోపిన శిక్షనుండి మనలను విమోచించినట్లే,
రెండవ రాకడలో మనలను ఈ లోకమునుండి సంపూర్ణంగా విమోచించి తీసుకొని పోతారు అని హెబ్రీ
9:28 యొక్క అర్థం. మన “రక్షణ నిమిత్తము” రెండవ సారి ప్రత్యక్షమగును అను మాటకు
అర్థం మన ప్రభువైన యేసు క్రీస్తు తన రెండవ రాకడలో మహిమతో దిగి వస్తాడని మాత్రమే
గాని ఆయన ఒక శిశువుగా తల్లి గర్భమునుండి మరలా పుడతాడని కాదు. అహన్ సంగ్ హాంగ్ అనే
ఈ వ్యక్తి సాధారణ జన్మ మరియు సాధారణ మరణం పొందాడు. మేఘముల మీద యేసు వస్తారని
చెప్పబడిన మాటకు సియోను సంఘంవారు మేఘమంటే శరీరమని చెబుతారు. దీనికి యూదా 1:12లో
వాడబడిన ఉపమాలంకారమును ప్రస్తావిస్తారు. అప్పుడు, యేసు మొదటి రాకడ గురించి చెప్పబడిన
ప్రవచనాలలో మేఘాలు ఎందుకు ప్రస్తావించబడలేదు? అప్పుడు కూడా శరీరధారియై వచ్చారు
కదా!
గమనించండి:
బైబిల్లో ఒక్క చోట వాడబడిన సాదృశ్యాన్ని అన్ని విషయాలలో వర్తింపజేయటం సబబు కాదు.
ఉదా: యేసు కొదమ సింహంగా పిలువబడ్డారు. సాతాను గర్జించు సింహంగా పిలువబడ్డాడు.
ఇక్కడ సింహం కామన్ కాని, వ్యక్తులు వేరు. బైబిల్ ను సరిగ్గా అర్థం చేసుకోవడానికి
ఇటువంటి నియమాలు కొన్ని మనకు తెలియాలి.
రెండవ
రాకడ సన్నివేశాలు ఇంకా జరుగలేదు: ప్రభువైన యేసు రెండవసారి వచ్చినప్పుడు
జరిగే సంగతులు 1 థెస్సలోనీకయులకు 4:14-17 ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి.
ఆయన వచ్చినప్పుడు చనిపోయిన విశ్వాసులు తిరిగి లేస్తారు కనుక ఆయన ఆ విశ్వాసులను వెంటబెట్టుకొని
ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని
బూరతోను పరలోకమునుండి దిగివస్తారు. బ్రతికున్న విశ్వాసులు మహిమ శరీరాలు
దాల్చుకొని, యేసును ఎదుర్కొని నిత్యమూ ఆయనతో ఉండుటకు పరలోకానికి వెళ్లిపోతారు. అహన్
సంగ్ హాంగ్ పుట్టటం, చనిపోవటం రెండూ జరిగాయి. క్రీస్తు రెండవసారి చనిపోతాడని
బైబిల్లో ఎక్కడా లేదు. అలాగే, అహన్ సంగ్ హాంగ్ చనిపోయినప్పుడు తనతో కూడా ఎవర్నీ
తీసుకు పోలేదు. అంతేకాదు, ఆయనే క్రీస్తు రెండవ రాకడైతే, ఇప్పుడున్న సియోను
సంఘస్తుల సంగతేమిటి? అహన్ సంగ్ హాంగ్ చనిపోయినప్పుడు అతడు తన సంఘస్తులను
తీసుకుపోలేదు కదా, మరి వారు పరలోకానికి ఎలా వెళ్తారు?
క్రూర
పక్షి దేవుడు కాదు: కొరియా ప్రపంచ దేశాలకు తూర్పున ఉందని, అందుకే
దేవుడు ఆ దేశాన్ని ఎన్నుకున్నాడని సియోను సంఘపువారు చెబుతారు. తూర్పు నుండి వచ్చే
“క్రూర పక్షి” (యెషయా 46:10-11) దేవుడు కాదని మనం గమనించాలి. అది
ఇశ్రాయేలీయులను దండించడానికి దేవుడు వాడుకున్న ఇశ్రాయేలు దేశమునకు తూర్పున ఉన్న క్రూరమైన
రాజుల గురించి చెప్పబడింది. దేవుడు తన్ను తాను క్రూర పక్షితో పోల్చుకోలేదు. ద్వితీ
32:11లో చెప్పబడిన పక్షిరాజు సాదృశ్యం, దేవుడు ఇశ్రాయేలీయులను కాచిన విధానాన్ని
తెలియజేస్తుంది. అంతగా మాట్లాడితే, సియోను సంఘం చెప్పినట్లు తూర్పునుండి వచ్చే
క్రూరపక్షి క్రైస్తవ సంఘాన్ని పాడు చేయడానికి కొరియా దేశంనుండి వచ్చిన అహన్ సంగ్
హాంగ్ అని మనం అనుకోవచ్చు.
అహన్
సంగ్ హాంగ్ (Ahn Sahng-hong) లో దేవుని లక్షణాలు అసలు లేవు:
·
దేవుడు పెళ్లిచేసుకుంటాడా? విడాకులు తీసుకుంటాడా? అహన్
సంగ్ హాంగ్ (Ahn Sahng-hong) వివాహితుడు. అంతే కాదు, అతడు తనభార్యకు విడాకులిచ్చి
మళ్ళీ వేరే స్త్రీని వివాహం చేసుకున్నాడు. దేవుడికి పెళ్లి ఏమిటండీ? అసలు విడాకులేంటి?
అది “క్రీస్తు నియమానికి” విరుద్ధం కాదా?
· దేవుడు అబద్ధం ఆడవచ్చా?
సియోను సంఘంవారు జంగ్ గిల్ జా (Jang Gil-ja)ను
తల్లియైన దేవుడని నమ్మినప్పటికి, “The New Jerusalem and the Bride:
Interpretation on Women’s Veil” అనే పుస్తకంలో తల్లియైన దేవుడే లేదని అహన్ సంగ్
హాంగ్ (Ahn Sahng-hong) స్వయంగా రాసాడు. ఇప్పుడు మనం ఎవరి మాట నమ్మాలి?
అదేంటి అని అని అడిగితే, నేనే తల్లి దేవుడిని అని చెప్పుకున్న ఒక సంఘ సభ్యురాలిని
వారించడానికి ఆయన అలా చెప్పాడని, ఆ సమస్య తీరిపోయిన తరువాత పుస్తకాలన్నీ తిరిగి
తీసుకుని ఇక పనైపోయింది కనుక ఇప్పుడు తల్లి దేవుడు ఉంది అని ఆయన బోధించాడని కథలు
చెబుతారు. అలాగైతే, అహన్ సంగ్ హాంగ్ (Ahn Sahng-hong)
అబద్ధం చెప్పినట్లు కాదా? పది ఆజ్ఞలు మీరినట్లు కాదా? దేవుడు కాబట్టి అబద్ధం
ఆడవచ్చా లేక అబద్ధం ఆడాడు కాబట్టి దేవుడు కాదని అర్థం చేసుకోవాలా? అబద్ధం చెప్పే
బదులు ఈ ఫలానా స్త్రీ దేవుడు కాదని చెప్పవచ్చు కదా!
అంత్యదినాలలో
అబద్ధ క్రీస్తులు, అబద్ధ బోధకులు వస్తారని, అక్కడ క్రీస్తు ఉన్నాడని, ఇక్కడ
క్రీస్తు ఉన్నాడని చెప్పి ప్రజలను మోసగిస్తారని, అటువంటి వారిని నమ్మవద్దని
ప్రభువైన యేసు క్రీస్తు ముందుగానే సెలవిచ్చారు (మత్తయి
24:23; మార్కు 13:21 చదవండి).
6. పరలోకంలో తల్లి ఉందా?
సియోను సంఘ బోధ:
దేవుడు
“మన స్వరూపంలో” స్త్రీనిగాను పురుషునిగాను నరులను చేద్దామని చెప్పారు (ఆది
1:26-27). “మన” అనే పదములో బహువచనం ఉంది గనుక తండ్రితో పాటు తల్లి కూడా ఉంది.
ఆదాము క్రీస్తుకు సాదృశ్యం (రోమా 5:14), ఆదాము స్త్రీకి “జీవముగల ప్రతివానికిని
తల్లి” అని అర్థమిచ్చే “హవ్వ” అని పేరు పెట్టాడు (ఆది 3:20). యేసు అంత్య దినమున తన
వారిని లేపుదును అని యోహాను 6లో చెప్పారు కనుక ఆ లేపబడే జీవం రావాలంటే హవ్వ లాంటి
తల్లి ఉండవలసిందే. ఆ తల్లి ఎవరో కాదు ఆమె వధువు (ప్రక 19:7), పరిశుద్ధ యెరూషలేము
(ప్రక 21:9-10). అదే మనకు తల్లి (గలతీ 4:26). ఆమె కొరియా దేశంలో ఉన్న జంగ్ గిల్ జా (Jang Gil-ja).
బైబిల్ బోధ:
మొదటిగా,
ఆదాము హవ్వల వలె దేవుడు రక్తమాంసములు కలవాడు కాడు. కొంత కాలము మట్టుకు యేసు
శరీరమును ధరించారు. కాని, దేవుడు ఆత్మయైయున్నారు (యోహాను 4:24). రెండవదిగా, “మనము”
అను పదం త్రిత్వమును గూర్చి తెలియజేస్తుంది. దైవత్రిత్వము బైబిల్లో తరువాత కాలంలో
పలు చోట్ల బయలుపరచబడింది. మూడవదిగా, తల్లియైన దేవుని గురించి బైబిల్లో ఎక్కడా
లేదు. మనకు జీవం ఇవ్వడానికి దేవునికి భార్య అక్కర లేదు. ఒకవేళ అలాగైతే, దేవుడు
పుట్టటానికి కూడా తల్లి కావాల్సిందే. ఎందుకంటే, స్త్రీ లేకుండా జీవం పోయలేని
దేవునికి జీవం ఎక్కడ నుండి వస్తుంది? ఆయన మనవంటి వాడు కాదు. ఆయన స్వయంభవుడు, ఆయనే
సమస్త జీవమునకు మూలాధారం. బైబిల్లో దేవునిలో ఉన్న తల్లివంటి ఆదరణ గురించి మాత్రమే
వ్రాయబడింది. గలతీ 4:26లో పౌలు, ధర్మశాస్త్రమును అనుసరించవద్దని చెప్పుచు “పరిశుద్ధ
యెరూషలేము”ను గురించి ప్రస్తావించాడు. ఈ లోకపు యెరూషలేము ఆ దినాల్లో రోమనుల
బానిసత్వంలో ఉంది కనుక దానిని, దానికి సంబంధించిన ధర్మశాస్త్రాన్ని శారాయి దాసియైన
హాగరు, ఆమె కుమారుడైన ఇష్మాయేలుతో పోల్చాడు. పరలోకాన్ని నిజమైన యెరూషలేముగా
సంబోధించి, స్వతంత్రురాలైన శారాయి, ఆమె కుమారుడైన ఇస్సాకుతో దానిని పోల్చాడు. మనం
వాగ్దాన పుత్రులం కనుక ఇకపై ధర్మశాస్త్రమనే కాడి క్రింద లేమని చెప్పడానికే ఈ వర్ణన
పౌలు ఉపయోగించాడు కానీ, పరలోకంలో తల్లి ఉందని దాని అర్థం కాదు.
ఇంకా
విచారకరమైన పరిస్థితి ఏమిటంటే, జంగ్ గిల్ జా (Jang Gil-ja) అనే
దక్షిణ కొరియాకు చెందిన ఒక స్త్రీ తల్లియైన దేవుడని వీరిలో కొందరు నమ్ముతున్నారు. జంగ్
గిల్ జా (Jang Gil-ja) అనే పేరు బైబిల్లో ఎక్కడా లేదు. బైబిల్లో
ఏమీ కలుపకూడదని, అలా చేస్తే తెగుళ్ళు సంభవిస్తాయని ప్రకటన 22:18 చూపించి భయపెట్టే
వీరే నచ్చినట్లు పేర్లు, సిద్ధాంతాలు కలుపుకుంటూ పోతున్నారు.
ఇకపోతే,
జంగ్ గిల్ జా జీవితం సాధారణ వ్యక్తివంటిదే. ఆమె మొదట జే హూన్ కిమ్ (Jae
Hoon Kim) అనే వ్యక్తిని వివాహం చేసుకొని, తన భర్తను, పిల్లలను లెక్కచేయకుండా,
తన ఆస్తిని Ahn Sahng-hongకు ధారబోసి, చివరకు తన భర్త నుండి విడాకులు
తీసుకుని Ahn Sahng-hongను పెళ్లిచేసుకుని, దేవుని వధువుగా పిలువబడింది (http://www.examiningthewmscog.com/archives/zahng-gil-jahs-ex-husbands-side-of-the-story). ఎంత
దౌర్భాగ్యం! ఈ విధంగా చేయుట వలన Ahn Sahng-hong వ్యభిచారి
అయ్యాడు, ఆమెను వ్యభిచారిణిగా చేసాడు.
నేను
మీతో చెప్పునదేమనగా వ్యభిచారకారణమునుబట్టి గాక, తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను
వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడినదానిని పెండ్లాడువాడు
వ్యభిచరించుచున్నాడు (మత్తయి 5:32); మరియు స్త్రీ తన పురుషుని
విడనాడి మరియొకని పెండ్లిజేసికొనినయెడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పెను
(మార్కు 10:12).
7. పరిశుద్ధాత్మ పేరు- రహస్య నామం
సియోను సంఘ బోధ:
మనమంతా
రక్షణ పొందాలనే కోరుకుంటున్నాము కనుక రక్షకుని పేరును మనం తెలుసుకోవాలి (1 పేతురు
1:8-9). ప్రతి యుగంలో రక్షకునికి ఒక పేరుంది (మత్తయి 28:19-20). పాత నిబంధనలో
రక్షకుని పేరు యెహోవా అని చెప్పబడింది (యెషయా 43:11), క్రొత్త నిబంధనలో రక్షకుని
పేరు యేసు చెప్పబడింది (అపొ 4:11-12). ప్రతి దానికి సమయము కలదు (ప్రసంగి 3:1) కనుక
ప్రతి పేరుకు కొంత కాల పరిమితి ఉంది. అలాగే ఆధునిక యుగంలో పరిశుద్ధాత్మ మనకు
రక్షకుడు. ఆయనకు ఒక పేరుంది. అది తెలిస్తేనే మనకు రక్షణ. ప్రకటన 3:11-12; 2:17లో
చెప్పబడిన రహస్య నామం అదే. ఈ వచనాలలో చెప్పబడిన తెల్ల రాయి యేసు క్రీస్తు (1
పేతురు 2:4; అపొ 4:11). తెలుపు రంగు పవిత్రతకు గుర్తు. పవిత్రత పొందిన వారికే ఆ
పేరు దొరుకుతుంది. ఆ తెల్ల రాయిని పొందాలంటే పస్కా పాటించాలి (యోహాను 6:49-51;
మత్తయి 26:17; 26-28). పస్కా పండుగను క్రీ.శ. 325లో నిసియ కౌన్సిల్ నిషేధించింది.
కాని, 1948లో అహన్ సంగ్ హాంగ్ దానిని తిరిగి
ప్రారంభించుట ద్వారా ప్రకటన 2:17 నెరవేర్చాడు. పరిశుద్ధాత్మయైన అహన్ సంగ్ హాంగ్
నామంలో మాత్రమే బాప్తిస్మం తీసుకోవాలి. ఇది పరిశుద్ధాత్మ యుగం కనుక అహన్ సంగ్ హాంగ్
నామంలో మాత్రమే ప్రార్థించాలి.
బైబిల్ బోధ:
పరిశుద్ధాత్మకు
ఒక పేరుందని బైబిల్లో ఎక్కడా ప్రవచించబడలేదు:
పరిశుద్ధాత్మకు ఒక పేరుందని, అదే క్రీస్తు అహన్ సంగ్ హాంగ్ (Christ Ahn
Sahng-hong) అని సియోను సంఘం వారు బోధిస్తున్నారు. రక్షణ
పొందాలంటే యేసును చూడకపోయినా సరే ఆయన యందు విశ్వాసముంచితే చాలు అని 1 పేతురు 1:8-9
చెబుతుంది. ప్రతి యుగానికి దేవునికి ఒక పేరుందని మత్తయి 28:19-20లో యేసు
చెప్పలేదు. అన్ని యుగాలలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు తమ కార్యాలను
నెరవేరుస్తారు కనుకనే త్రియేక దేవుని నామములోనికి బాప్తిస్మము పొందాలని ముగ్గురి
గురించి యేసు ప్రస్తావించారు. సియోను సంఘం బోధించినట్లు, వారు ముగ్గురు ఒక్కటే
అని, వేర్వేరు యుగాలలో వేర్వేరు పేర్లు కలిగి ఉన్నారని అన్న మాట నిజము కాదు.
తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మం ఇవ్వమని
యేసు ఆజ్ఞాపించిన చోట ఎవరి పేరు ప్రస్తావించబడలేదు. పరిశుద్ధాత్మ పేరు ‘క్రీస్తు
అహన్ సంగ్ హాంగ్’ అని బైబిల్ మొత్తంలో అసలు ఎక్కడా లేదు.
ఈ
ఆధునిక యుగంలో పరిశుద్ధాత్మ రక్షకుడని బైబిల్లో ఎక్కడా లేదు:
తండ్రి, కుమారులతో కలసి పరిశుద్ధాత్మ దేవుడు మన రక్షణ కార్యంలో పాల్గొంటారు. మనలను
పాపము విషయమై ఒప్పించుట, మనలను నూతన పరచుట, మనలో నివసించుట, ఆదరణ కర్తగా ఉండి మనకు
సహాయపడుట వంటి కొన్ని కార్యాలు జరిగిస్తారు. అలాగని తండ్రి కుమారులు ఇకపై ఉనికిలో
లేరు, వారితో పని లేదని బైబిల్ ఎక్కడా బోధించుట లేదు. పాత నిబంధనలో యెహోవా దేవుని
విమోచకునిగా చూపించినప్పటికీ, అప్పటి వారు సహితం క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ
ఆయనకు సాదృశ్యమైన బలులను అర్పించవలసిందే. ఇప్పుడు ఆయన తానే బలియై మనకొరకు
నిత్యవిమోచన సంపాదించెను (హెబ్రీ 9:11) కనుక మనకు వేరొక రక్షకుడు ఎప్పటికీ అవసరం
లేదు.
పరిశుద్ధాత్మ
పేరు తెలియని అపొస్తలుల సంగతేమిటి?: పరిశుద్ధాత్మ గురించి చెబుతూ యేసు,
వేరొక ఆదరణకర్తను పంపుతానని వాగ్దానం చేసారు, అలాగే పంపించారు కూడా. సియోను సంఘ
బోధ నిజమైతే 1918లో అహన్ సంగ్ హాంగ్ (Christ Ahn Sahng-hong)
పుట్టేవరకు పరిశుద్ధాత్మ పేరు ఎవరికీ తెలియదు కనుక యేసు శిష్యులు యిచ్చిన
బాప్తిస్మాలు, చేసిన ప్రార్థనలు మరియు పొందిన పరిశుద్ధాత్మ తప్పు కావాలి కదా! మొదటి శతాబ్దంలోని శిష్యులు పరిశుద్ధాత్మను
పొందుకున్నారు. అప్పటి నుంచి సంఘం పరిశుద్ధాత్మ నడిపింపులో కొనసాగుతుంది (అపొ 2:4).
అహన్
సంగ్ హాంగ్ అనే పేరు నిజంగా ఒక పెద్ద రహస్యమా?:
పరిశుద్ధాత్మ పేరని పిలువబడుతున్న అహన్ సంగ్ హాంగ్ అనే నామం, కేవలం జయించిన వారికే
ఇవ్వబడుతుందని చెబుతున్నారు. సియోను సంఘంవారు ఇప్పటికే జయించి పరలోకంలో ఉన్నారా? ఆ
పేరు మాకు కూడా తెలుసు కదా, మరి మాకు కూడా ఆ తెల్లరాయి ఇవ్వబడినట్లేనా? (ప్రకటన 2:17).
రక్షణకు
పస్కా పండుగకు సంబంధం లేదు: యోహాను 6:49-51; మత్తయి 26:17; 26-28 చూపించి
పస్కా పండుగను మనం కూడా ఆచరిస్తేనే పవిత్రులం అవుతామని సియోను సంఘం బోధిస్తుంది. రాబోవుచున్న
దేవుని గొర్రెపిల్లయైన యేసుకు సాదృశ్యంగా ఉండుటకు యూదులు పస్కా పశువును వధించారు.
యేసు ఒక యూదునిగా దీనిని ఆచరించారు కాని
దానికి ఒక నూతన అర్థాన్ని ఇచ్చారు. యేసు తన శిష్యులతో కుడా పస్కాను ఆచరించిన
సన్నివేశంలో ఆయన పస్కా బలిగా అర్పించబడిన గొర్రెపిల్ల మాంసమును చూపించి ఇది నా
శరీరం, దీనిని తినండి అని చెప్పలేదు. ఆయనే ఆ బలిగా మారబోతున్నారు కనుక గొర్రె
పిల్లను ఇకపై చంపవలసిన అవసరం లేదు. రొట్టెను ద్రాక్షరసమును చూపించి అవి ఆయన
రక్తమాంసములని చెప్పారు. అందుకే మనం పస్కాను యూదులవలె ఆచరించనవసరం లేదు. ప్రభువు
చూపించినది చేస్తే చాలు (1 కొరింథీ 11:23-34). యూదుల పండుగలను నైసిన్ కౌన్సిల్
నిషేధించలేదు. పేతురు మరియు పౌలు సమక్షంలో ఆది అపొస్తలులే దానిని క్రైస్తవ విధులలో
జతపరచలేదు (అపొ 15:19).
యేసు
నామముననే రక్షణ కనుక మనం ఆ నామముననే ప్రార్థించాలి: ఇది
పరిశుద్ధాత్మ యుగం కనుక ఇప్పుడు పరిశుద్ధాత్మ పేరున ప్రార్థన చేయాలని సియోను సంఘం
బోధిస్తుంది. కాని, యేసుక్రీస్తు తన నామమున ప్రార్థించమని చెప్పారు.
ఆ
దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు; మీరు
తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా
చెప్పుచున్నాను (యోహాను 16:23).
యేసు ఆరోహణమై తండ్రియొద్దకు వెళ్ళిన
తరువాత కూడా ఆయన నామమున ప్రార్థన చేస్తేనే విమోచన, ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది.
మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ
నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము
క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను (అపొ 4:12).
అదేమనగా,
యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు
మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు
రక్షింపబడుదువు (రోమా 10:9).
పై వచనాలు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ
లోకానికి వచ్చిన యేసును గూర్చి మాత్రమే చెబుతున్నాయని అర్థం చేసుకోవటం అంత
కష్టమేమి కాదు. బైబిల్లో ఎక్కడా, మరొక నామంలో రక్షణ ఉంటుందని చెప్పబడలేదు. మరొక సంగతి-
“మృతులలోనుండి లేపబడుట” ఒక్క ప్రభువైన యేసుకే చెందిన విషయం. అహన్ సంగ్ హాంగ్
చనిపోయి తిరిగి లేవలేదు. అతడు దేవుడు కాదు, రక్షకుడు అంతకంటే కాదు.
8. మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు
·
అబద్ధ బోధకులను గుర్తించగలగాలి. అబద్ధ
బోధకులు బైబిల్లో ప్రత్యక్షపరచబడిన దేవునికంటే వారి నాయకునికే ఎక్కువ ప్రాముఖ్యతను
ఇస్తారు. కొందరైతే, సియోను సంఘం వారివలె తమ నాయకులను దేవునిగా పరిగణిస్తారు.
ఇక్కడే మనకు వారిలోని అసత్యం అర్థం అవుతుంది. అబద్ధబోధకులు మనం అడిగే ప్రతి ప్రశ్నకు ఏదో ఒక బదులు చెబుతారు. కథలు
చెప్పటం, వక్రీకరించటం, భయపెట్టటం మరియు ఆశపెట్టడం వంటి విధానాలను ఉపయోగిస్తారు.
వారి బోధలన్నీ ఎవరో చెబితే తెలుసుకున్నవైనప్పటికి, మనుష్యులు కాదు దేవుడే మాకు
సత్యాన్ని బయల్పరచాడని చెబుతారు.
·
ముందుగా వాక్యపరిజ్ఞానం ఉన్నవారితో
మాట్లాడించాలి. మీరు వాక్యం క్షుణ్ణంగా తెలిసిన వారైతే
ఫరవాలేదు. లేనట్లయితే, మీరు దుర్బోధకుల మాటలు వినకూడదు. మనం చేసేది తప్పు అని ఎవరో
చెబితే వారితో కూర్చొని అబద్ధ బోధలు నేర్చుకునే మీరు వారు చేసేది తప్పో ఒప్పో అని వాక్యపరిజ్ఞానం
ఉన్నవారిని అడిగి తెలుసుకోవాలి కదా! అలా మీరు ఎందుకు చేయరు? మీరు ఎదిగిన బోధకు
భిన్నమైనవి బోధించేవారు మిమ్మును కలిసినప్పుడు వారిని వాక్యం తెలిసినవారి యొద్దకు
తీసుకు రండి. వారినే తలపడనివ్వండి. మీ దగ్గర జవాబు లేదంటే ఎదుటివారు చెప్పేది
సత్యమని అర్థం కాదు. అబద్ధ బోధకులకు, వారి సంఘస్తులకు ఒక సిలబస్ ఉంటుంది. దాన్ని
క్షుణ్ణంగా నేర్చుకుని వల్లిస్తారు. మీకు తెలియకపొతే, యితరులను అడిగి తెలుసుకోండి.
కనిపించిన ప్రతి క్రొత్త సిద్ధాంతానికి కొట్టుకుపోకండి.
· వారు చెప్పే వచనాలను మనకు మనంగా సందర్భానుసారంగా,
క్షుణ్ణంగా చదవాలి. ముందుగా ప్రస్తావించబడినట్లుగా అబద్ధ బోధకులు
వ్యాకరణ, అనువాద, వ్యాఖ్యాన నియమాలు పాటించరు. వాటి గురించి మాట్లాడితే, మనం
ఆత్మీయంగా మరియు ప్రార్థనాపూర్వకంగా ఉంటే దేవుడు బయలుపరుస్తారని, పరిసయ్యుల వలె
ప్రవర్తించకూడదని ఖండిస్తారు. లేఖనాలను తమకు నచ్చినట్లు మార్చుకొని విశ్వాసులపై
అత్యధిక భారములను మోపే వీరే ఆధునిక పరిసయ్యులని గుర్తించండి (మత్తయి 23:13-15). మీరు
వీరి ఖండిపుకు తలొగ్గ కూడదు. ఎందుకంటే, మనకు బోధించే వారిలో ఎవ్వరూ ఈ క్రొత్త
బోధను వారంతట వారు ప్రార్థనలో పొందుకున్న ప్రత్యక్ష్యత కాదు. ఎవరో చెబితేనే వీరికి
తెలిసింది. ప్రార్థన పేరుతో మిమ్మును మోసగించి ఆలోచించకుండా చేస్తారు కనుక
జాగ్రత్తపడండి.
·
మరలా మరలా మీకు ఈ బోధ చెప్పుటకు అనుమతి
యివ్వవద్దు. ఫలమును బట్టి చెట్టును గుర్తిస్తాము. వీరి వద్ద
ఇటువంటి అబద్ధ బోధలు ఉన్నాయని మీకు తెలిస్తే, వారిని దైవజనులుగా పరిగణించి వారిని
చేర్చుకొనవద్దు. వారి నుండి ఎటువంటి బోధలు వినవద్దు. క్రీస్తును వెంబడించే మనం
అబద్ధ బోధకులను ఎదురించాలని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది (అపొ 20:28-30; మత్త
7:15; తీతుకు 1:13-14; 2పేతురు 2 చదవండి).
క్రీస్తుబోధ
యందు నిలిచియుండక దానిని విడిచి ముందునకుసాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు;
ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించు వాడు.
ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట
చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని
వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును (2
యోహాను 1:9-11).
అసలు దేవుడినే మార్చేసి మనిషిని ఆరాధించే
సియోను సంఘపువారు మిమ్మును నరకానికి తప్ప పరలోకానికి నడిపించలేరు. వారు శాపగ్రస్తులు
కావడమే కాక మనలను కూడా భయంకరమైన నరక శిక్షకు నడిపిస్తారు. ప్రభువైన యేసు క్రీస్తు
తప్ప మరి ఎవ్వరు మీకు రక్షణ కలుగ జేయలేరు.
“క్రీస్తు
కృపనుబట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన
సువార్తతట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది. అది
మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును
కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక
సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రక టించినయెడల అతడు
శాపగ్రస్తుడవును గాక” (గలతీ
1:6-7).
అబద్ధ బోధకులను
ఎదురించి బైబిల్ బోధించే సత్యములో నడుచుకొని దేవుని ఆశీర్వాదములు పొందుదురు గాక.
ఆమెన్.
-------o------
మీ
గ్రామాలలో అబద్ధ బోధకులను ఎదురించడానికి సహాయం కొరకు సంప్రదించండి:
Pastor Prem Kumar Havaji
Phone:
8500641801
E-mail: prem.havaji@gmail.com
www.telugusermon.blogspot.com
www.telugusermon.blogspot.com
No comments:
Post a Comment