Tuesday, January 17, 2017

కృంగిపోయావా?


శ్రమలు, శోధనలు అలుముకున్నప్పుడు కృంగిపోవటం సహజం. దేవునికి దూరంగా ఉంటే అది మరింత దుర్భరంగా ఉంటుంది. కొన్ని సార్లు దేవునికి మనమే దూరంగా ఉంటూ ఆయన మనకు దూరంగా ఉన్నాడని అనుకుంటాం. దేవుడు మన పరిస్థితుల్లో వెంటనే మార్పును తెచ్చి ఆయన మనలను ఆదరించే ఆనవాళ్ళేమో ఏమాత్రం కనిపించవు. అట్టి స్థితిలో మీరున్నారా?
42వ కీర్తనలో మొదటిగా ఆత్మీయ కరవు, తరువాత శ్రమల ప్రళయం ప్రస్తావించబడ్డాయి. దేవుని సన్నిధి అనుభవించలేని స్థితిలో ఆయన కొరకు కీర్తనాకారుడు పడిన తపన మరియు శోధనలు మరియు నిందలు అనే నీటి ప్రవాహంలో పడి ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పటి ఆవేదన మనకు అగుపిస్తాయి. అది మొత్తానికి మునిగిపోయి, కృంగిపోయి, చావలేక, బ్రతకలేక ఉన్న పరిస్థితి.
ఇక్కడ కీర్తనాకారుడు మూడు పనులు చేసాడు. మనం కూడా చేస్తే మంచిది.
1.       తన ప్రాణమును ప్రశ్నించాడు
2.       తన ప్రాణమునకు బోధించాడు
3.       దేవునితో మాట్లాడాడు
4.       దేవునిని స్తుతియించాడు
తెలుగులో ‘ప్రాణము’, యింగ్లీషులో ‘soul’ లేదా హెబ్రీలో ‘నెఫెష్’. హెబ్రీ పదానికి ఊపిరి, జీవ శక్తి, వాంఛ, చిత్తము అని కొన్ని అర్థాలు ఉన్నాయి. ఇది మన ఉనికికి, జీవమునకు, ఆలోచనలకు ఒక్క మాటలో ‘అంతరంగములోని సమస్తము’నకు కేంద్రబిందువు. మన భౌతిక అస్తిత్వం దీని చుట్టూనే పరిభ్రమిస్తుంటుంది. ‘సోల్’ లేదా ‘ప్రాణము’ సరైన స్థితిలో ఉంటేనే మన జీవనం సరైన స్థితిలో ఉంటుంది. మన జీవనాన్ని సరిచేసుకోవాలంటే ‘సోల్’ అనే లోతులోనికి వెళ్లవలసిందే!
అందుకే కీర్తనాకరుడు తన ఆత్మీయ దప్పికను తెలియజేసిన తరువాత ముందుగా తన ప్రాణమును ప్రశ్నిస్తున్నాడు. ‘నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? (వ.5). మన అంతరంగాన్ని ప్రశ్నించుకొనుటతోనే నిజమైన మార్పు మనలో ప్రారంభమౌతుంది. మార్పు మనలో ప్రారంభమైతేనే అది మన పరిస్థితుల్ని మారుస్తుంది. అంతర్గత కేంద్రంలో మార్పు ప్రారంభం కాకుండా బహిర్గత మార్పు సరియైనది కాదు. యింధనం ఉంటేనే నిప్పు రాజుకుంటుంది, నిప్పు రాజుకుంటేనే వాహనం కదులుతుంది. అందుకే మన హృదయ లోతుల్ని ప్రశ్నించి పరిశీలించుకోవటంతో మార్పు ప్రారంభం కావాలి.
పరిస్థితులను బట్టి కృంగియున్నావా? ఆత్మపరిశీలన ప్రారంభించు. అసలు సమస్య ఎక్కడ ప్రారంభమైనదో నిశితంగా తెలుసుకో. నీవు కోల్పోయినట్లు తలస్తుంది ఏమిటి? నిజంగా నీవు కోల్పోయింది ఏమిటి? నీవు కోల్పోయింది మనుష్యుల్ని, సంపదను, హోదాను, ఉద్యోగాన్ని గౌరవమర్యాదలను అయి ఉండవచ్చు. వాటికంటే ప్రాముఖ్యమైనది ఏదైనా కోల్పోయావేమో! ఈ లోకంలో ఏది ఉన్నా లేకున్నా సర్వశక్తుడైన దేవుని యందలి ఆసక్తి మనలో లేకుంటే మన నిరాశకు అదే కారణం. నీవు ఆణువణువునా కోరుకునేది ఏమిటి? గతించిపోయే ఈ లోక సౌఖ్యలనా లేక స్థిరమైన దేవుని సన్నిధినా? “దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది” (వ.1) అని కీర్తనాకారుడు పాడుతున్నాడు. కనుక మనం నిరుత్సాహంలో ఉన్నప్పుడు మొదటిగా మనల్ని మనం పరిశీలించుకొని మన వాంఛలను సరిదిద్దుకోవాలి. నిరాశ పాశములను చేధించడానికి ఆత్మపరిశీలన మొదటి మెట్టు. మిగతా విషయాలు తరువాత చర్చిద్దాం... (To be continued).