యాకోబు 1:19-27
ఒక ప్రసంగం మన
జీవితాన్ని మార్చాలంటే, దానిని వినవలసిన విధానం సరిగా ఉండాలి. విన్న వాక్యం మన
జీవితంలో మార్పును తేవాలంటే, మనం చేయవలసిన పనులు కొన్ని చూద్దాం.
1. వినుటకు
వేగిరపడి మాటలాడుటకు నిదానించాలి (19. వ.)
“దేవుడు మనకు ఒకే
నోరు యిచ్చి రెండు చెవులు ఇచ్చింది, మనం మాట్లాడే దానికంటే రెండంతలు ఎక్కువ
వినటానికి” అని ఎవరో అన్నారు. నోరు, చెవులు సంగతి ఏమోగాని, వినుటకు ఆసక్తిని
చూపించాలని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. “వేగిరపడుట”ను గ్రీకు
భాషలో “టాఖూస్” అన్నారు. అనగా, “సిద్ధపాటు” అని భావం. దేవుని వాక్యం వినడానికి
మనలో సిద్ధపాటు ఉండాలి.
2.
కల్మషం, దుష్టత్వం తీసివేసుకోవాలి (21. వ.)
మనసంతా చెడుగు
దాచుకొని ప్రసంగం వింటే మురికి నీళ్ళతో నింపబడిన పాత్రలో మంచి నీటిని
పోసినట్లుంటుంది. మనలను మార్చేది దేవుని వాక్యమే. కానీ ఆ మార్పు మరింత వేగతరముగాను
ఫలభరితంగాను ఉండాలంటే, ముందుగా మనం కల్మషాన్ని తొలగించుకోవాలి. ముత్యాలను చెత్త బుట్టలో దాచుకోము కదా!
నిర్గమ 19:10-11లో దేవుడు
ఇశ్రాయేలీయులతో మాట్లాడేముందు వారిని సిద్ధపడమని అజ్ఞాపించారు. తమ వస్త్రములను
శుభ్రపరచుకొనమని చెప్పారు. మనలో ఎంతో కొంత చెడుగు ఉండకపోదు. అటువంటి దానిని మనం తొలగించుకోవాలి.
“మేమందరము
అపవిత్రులవంటివారమైతివిు. మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను. మేమందరము ఆకువలె వాడిపోతివిు.
గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను” (యెషయా 64:6).
“కావున
భూమిమీదనున్న మీ అవయవములను,
అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపి
వేయుడి. వాటివలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు
మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము,
దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి” (కొలస్సీ 3:5-8).
3. మనలో
విత్తబడిన దేవుని వాక్యాన్ని వినయముతో అంగీకరించాలి (21. వ.)
దేవుని
వాక్యానికి మనలను రక్షించే శక్తి ఉంది కనుక మనం దానిని వినయముతో అంగీకరించాలి. దేవుని
వాక్యము ప్రాణమును తెప్పరిల్లజేయునది (కీర్తన 19:7) దానిని మనం దప్పికతో ఉన్న వ్యక్తివలె
స్వీకరించాలి. లూకా 8వ అధ్యాయంలో యేసు చెప్పిన “విత్తువాని ఉపమానం”లోని మంచి
నేలవలె మనం ఉండాలి. అప్పుడు దేవుడు తన వాక్యాన్ని శక్తితో నింపి అయన చిత్తాన్ని మన
జీవితాలలో నెరవేర్చడం జరుగుతుంది (యెషయా 55:10).
4. దేవుని
వాక్యం బోధించునది ఆచరించుట కొనసాగించాలి (22వ.&25 వ.)
ఒకడు
అద్దములో చూచుకొని తన ముఖమును సరిచేసుకొనునట్లు వాక్యము విని దాని ప్రకారం మన
జీవితాలను సరిచేసుకోవాలి. మనం వినువారు మాత్రమైయుంటే ఎన్ని ప్రసంగాలు వినినాసరే
ఉపయోగముండదు. అప్పుడు తీర్పు దినాన మనం వినిన వాక్యమును బట్టి మనం తీర్పులోనికి రాక
తప్పదు. బోధను వినినప్పుడు దానిని మన జీవితాలకు అన్వయించుకొని దాని ప్రకారం
జీవించాలి.
దేవుని వాక్యము వినవలసిన విధానంలో మనం వింటే
మనం మన జీవితాలలో గొప్ప మార్పును చూడగలం. మన ఆలోచనావిధానం దేవుని వాక్యానుసారంగా
మారాలి. అప్పుడే దేవుని సంతోషపరచేవారముగా మనం మారగలం.
నేను ఇంకా ఏదైనా చెప్పడం మరిచిపోయానా? మీకు ఇంకా ఏదైనా క్రొత్త విషయం తెలుసా? దయచేసి కామెంటులో వ్రాయండి.