Saturday, October 3, 2015

దేవుని వాక్యము ఎలా వినాలి?

యాకోబు 1:19-27

ఒక ప్రసంగం మన జీవితాన్ని మార్చాలంటే, దానిని వినవలసిన విధానం సరిగా ఉండాలి. విన్న వాక్యం మన జీవితంలో మార్పును తేవాలంటే, మనం చేయవలసిన పనులు కొన్ని చూద్దాం.

1. వినుటకు వేగిరపడి మాటలాడుటకు నిదానించాలి (19. వ.)

“దేవుడు మనకు ఒకే నోరు యిచ్చి రెండు చెవులు ఇచ్చింది, మనం మాట్లాడే దానికంటే రెండంతలు ఎక్కువ వినటానికి” అని ఎవరో అన్నారు. నోరు, చెవులు సంగతి ఏమోగాని, వినుటకు ఆసక్తిని చూపించాలని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. “వేగిరపడుట”ను గ్రీకు భాషలో “టాఖూస్” అన్నారు. అనగా, “సిద్ధపాటు” అని భావం. దేవుని వాక్యం వినడానికి మనలో సిద్ధపాటు ఉండాలి.

2. కల్మషం, దుష్టత్వం తీసివేసుకోవాలి (21. వ.)

మనసంతా చెడుగు దాచుకొని ప్రసంగం వింటే మురికి నీళ్ళతో నింపబడిన పాత్రలో మంచి నీటిని పోసినట్లుంటుంది. మనలను మార్చేది దేవుని వాక్యమే. కానీ ఆ మార్పు మరింత వేగతరముగాను ఫలభరితంగాను ఉండాలంటే, ముందుగా మనం కల్మషాన్ని తొలగించుకోవాలి. ముత్యాలను చెత్త బుట్టలో దాచుకోము కదా!

నిర్గమ 19:10-11లో దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడేముందు వారిని సిద్ధపడమని అజ్ఞాపించారు. తమ వస్త్రములను శుభ్రపరచుకొనమని చెప్పారు. మనలో ఎంతో కొంత చెడుగు ఉండకపోదు. అటువంటి దానిని మనం తొలగించుకోవాలి.

“మేమందరము అపవిత్రులవంటివారమైతివిు. మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను. మేమందరము ఆకువలె వాడిపోతివిు. గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను” (యెషయా 64:6).

“కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపి వేయుడి. వాటివలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి” (కొలస్సీ 3:5-8).

3. మనలో విత్తబడిన దేవుని వాక్యాన్ని వినయముతో అంగీకరించాలి (21. వ.)

దేవుని వాక్యానికి మనలను రక్షించే శక్తి ఉంది కనుక మనం దానిని వినయముతో అంగీకరించాలి. దేవుని వాక్యము ప్రాణమును తెప్పరిల్లజేయునది (కీర్తన 19:7) దానిని మనం దప్పికతో ఉన్న వ్యక్తివలె స్వీకరించాలి. లూకా 8వ అధ్యాయంలో యేసు చెప్పిన “విత్తువాని ఉపమానం”లోని మంచి నేలవలె మనం ఉండాలి. అప్పుడు దేవుడు తన వాక్యాన్ని శక్తితో నింపి అయన చిత్తాన్ని మన జీవితాలలో నెరవేర్చడం జరుగుతుంది (యెషయా 55:10).

4. దేవుని వాక్యం బోధించునది ఆచరించుట కొనసాగించాలి (22వ.&25 వ.)

ఒకడు అద్దములో చూచుకొని తన ముఖమును సరిచేసుకొనునట్లు వాక్యము విని దాని ప్రకారం మన జీవితాలను సరిచేసుకోవాలి. మనం వినువారు మాత్రమైయుంటే ఎన్ని ప్రసంగాలు వినినాసరే ఉపయోగముండదు. అప్పుడు తీర్పు దినాన మనం వినిన వాక్యమును బట్టి మనం తీర్పులోనికి రాక తప్పదు. బోధను వినినప్పుడు దానిని మన జీవితాలకు అన్వయించుకొని దాని ప్రకారం జీవించాలి. 

దేవుని వాక్యము వినవలసిన విధానంలో మనం వింటే మనం మన జీవితాలలో గొప్ప మార్పును చూడగలం. మన ఆలోచనావిధానం దేవుని వాక్యానుసారంగా మారాలి. అప్పుడే దేవుని సంతోషపరచేవారముగా మనం మారగలం.
నేను ఇంకా ఏదైనా చెప్పడం మరిచిపోయానా? మీకు ఇంకా ఏదైనా క్రొత్త విషయం తెలుసా? దయచేసి కామెంటులో వ్రాయండి.

Monday, September 28, 2015

దురాశ-దుఃఖము-దుష్ట నిర్ణయాలు

న్యాయాధిపతులు 9

అబీమెలెకు గిద్యోను కుమారులలో ఒకడు మరియు అతడు ఇశ్రాయేలుపై తనకు తానుగా నియమించుకొనిన న్యాయాధిపతి. అతడు ఒకప్పటి దాసియైన గిద్యోను ఉపపత్నికి జన్మించినవాడు. బైబిలు గ్రంధం అతని జీవితంలోనుండి నేర్పించే మూడు విషయాలు మనం గమనిద్దాం.

1. దురాశ

అబీమెలెకు అతని తండ్రి మరణానంతరం అత్యంత దురాశపరునిగా మారాడు. గిద్యోను తాను గాని, అతని కుమారులు గాని ఇశ్రాయేలీయులపై ఏలికగా ఉండుటకు సుముఖత చూపలేదు గాని దేవుడైన యెహోవాయే వారికి రాజుగా ఉండాలని కోరుకున్నాడు (న్యాయాధిపతుల 8:22-23). కానీ అబీమెలెకు అతని పేరుకు తగ్గట్టుగా (‘నా తండ్రి రాజు’ లేదా ‘రాజుకు తండ్రి’) ఇశ్రాయేలీయులపై ఏలుబడిని ఆశించాడు. బహుశా తన పేరు మరియు ఆలోచనకు మూలం తన తల్లి కావచ్చు అని కొందరు పండితుల వాదన. ఏవిధము చేతనైనా ఇశ్రాయేలీయులపై న్యాయాధిపతిగా ఉండాలని తీవ్రమైన కోర్కెను పెంచుకున్నాడు. 

ఈ ఆశ అతనిని తన తల్లియొక్క సొంత పట్టణమైన షెకెమునకు నడిపించింది. అక్కడ తన తల్లి సహోదరులతో కలసి తగిన సహాయము సమకూర్చుకుని తిరిగి తన తండ్రి పట్టణమైన ఓఫ్రాకు తిరిగి వచ్చి తన డెబ్బదిమంది సహోదరులను ఒక్కరాతిపైనే చంపివేశాడు. అతనిలోని దుర్మార్గత కట్టలు తెంచుకుంది. 

మన జీవితంలో ఆశ ఉండాలి కానీ దురాశ భయంకరమైన దుర్మార్గతలోనికి మనలను నెట్టివేస్తుంది. పశ్చాత్తాపము లేని ఉద్దేశపూర్వకమైన పాపపు కార్యములే దుర్మార్గత.  ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును. దురాశ గర్భమును ధరించి పాపమును” కనును అను మాట వాస్తవమే (యాకోబు 1:15-16).

విజయము మరియు అధికారము లేదా ధనఘనతల కొరకు ఎంతటికైనా తెగించడం ఈ లోక విధానం. ఆశీర్వాదమునకు దేవుడు వ్యతిరేకి కాదు. మనలను దీవించుటయే ఆయన సంకల్పం. కానీ దేవుని చిత్తానుసారమైన దీవెనకు మరియు మన స్వకీయ దురాశకు మధ్య అతి సున్నితమైన విభజన ఉంటుంది. మనము ఏ సమయంలోనైనా ఒక ప్రక్కనుండి మరొక ప్రక్కకు జారిపోవచ్చు. కనుక మనము దేవుని చిత్తాన్ని యెరిగి ప్రవర్తించాలి (యాకోబు 4:13-17 చదవండి). 


దేవుని చిత్తానుసారమైన దీవెనకు మరియు మన స్వకీయ దురాశకు మధ్య అతి సున్నితమైన విభజన ఉంటుంది.
 

క్రైస్తవులముగా మనకుండవలసిన ఆశను గురించి పౌలు 1థెస్సలోనికయులకు 4:11-12 లో చక్కగా వివరించాడు:
“సంఘమునకు వెలుపటివారి యెడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమియు కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞా పించిన ప్రకారము మీరు పరులజోలికి పోక,  మీ సొంతకార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుటయందును ఆశకలిగి యుండవలెననియు, మిమ్మును హెచ్చరించుచున్నాము.”

2. దుఃఖము:
 
ఒకని దురాశ మరియు దుష్టత్వము అనేకమందిని దుఃఖము మరియు వేదనలకు గురిచేస్తుంది. అబీమెలెకు తన తండ్రి కుమారులను హతమార్చినప్పుడు వారిలో ఒకడైన యోతాము దాగుకొని తప్పించుకోగలిగాడు. తండ్రిని కోల్పోయిన అతడు తన సహోదరులు హతమార్చబడుటను చూచినప్పుడు భయంకరమైన వేదనకు గురైయుండవచ్చును. అతనిలోని వేదనలోనుండి పుట్టుకొచ్చిన ఒక శాపవచనాన్ని అబీమేలుకునకు వ్యతిరేకంగా పలుకుతాడు. 

మనలో అనేకమంది తమ జీవితంలో అన్యాయాన్ని ఎదుర్కుంటారు. మనకు అన్యాయం జరిగినప్పుడు మనం దానికి ఏవిధంగా స్పందిస్తామనునది చాలా ప్రముఖ్యమైన విషయం. యోతామునకు అన్యాయం జరిగినప్పుడు అన్యాయం జరిగించువారికి జరుగవలసిన తీర్పును తాను గుర్తించాడు. తాను స్వయంగా పగతీర్చుకొనుటకు ఇష్టపడలేదు గాని జరుగవలసిన దానికొరకు దాగుచోటులో వేచియున్నాడు.

ఒకసారి ఒక తండ్రి మరియు తన కుమారుడు భయంకరమైన మంచు తుఫానుకు ఆకులు రాల్చిన ఒక చెట్టును చూచారు. ఆ చెట్టు చనిపోయిందేమో అనుకుని వంట చెరకు కొరకు దానిని నరికివేసారు. అది శీతల దేశం మరియు శీతాకాలం. కానీ ఋతువు మారగానే ఆ మోడులోనుండి మొలకలు రావడం ప్రారంభించాయి. అది గమనించిన తండ్రి తన కుమారునితో, “అయ్యో, ఈ చెట్టు చనిపోయిందని అనుకుని దీనిని నరికివేశాం. కానీ దీనికి ఇంకా ప్రాణము ఉంది. కుమారుడా, ఒక పాఠం మనం నేర్చుకోవాలి. మంచు తుఫానులో చెట్లు నరకకూడదు; అలాగే, వేదనలో నిర్ణయాలు తీసుకోకూడదు” అని చెప్పాడు.

వేదనలో  ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి గాని తొందరపాటు పనికిరాదు. తొందరపాటులో తీసుకునే నిర్ణయాలు నష్టమును కలుగజేస్తాయి. 

పాత నిబంధన భక్తునిగా యోతాము దేవుని ఉగ్రతయందు నమ్మికయుంచాడు. క్రొత్తనిబంధన విశ్వాసులముగా మనకు మరింత ఉన్నత విలువలు ఇవ్వబడ్డాయి. “మిమ్మును బాధించువారికొరకు ప్రార్థనచేయుడి” అని యేసు అజ్ఞాపించారు (లూకా 6:28). 

మనకు జరిగిన అన్యాయమునకు మనం ఏవిధంగా స్పందించాలి? 

కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగి యుండుడి.  శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది. కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు.  కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము” (రోమా 12:17-21).

3. దుష్ట నిర్ణయాలు:

ఈ విచారకరమైన గాధయంతటిలో షెకెము వారు తీసుకున్న నిర్ణయమును మనం గుర్తించాలి. వారి నిర్ణయం వారిమీదికి ఎటువంటి ఉపద్రవము తెచ్చిందో మనం తెలుసుకోవాలి. గిద్యోను మరణం తరువాత అబీమెలెకు తమకు నాయకునిగా ఉండుటకు ప్రయత్నించినప్పుడు వారు న్యాయమును మరచి అతని వెంబడించారు. గిద్యోను షెకెము వారి కొరకు చేసిన త్యాగమును మరిచిపోయి అతని కుమారులను చంపిన అబీమెలెకు చేతులను వారు బలపరచారు(న్యాయాధిపతులు 9:24). మన ముందుకు ఒక అవకాశము వచ్చినప్పుడు, అది ఎంత గొప్పదైనప్పటికి తొందరపడి ఆ మార్గములో వెళ్ళకూడదు. దేవుని చిత్తమేదో తెలుసుకుని ప్రవర్తించాలి. న్యాయన్యాయములు ఎరిగి ప్రవర్తించాలి. నేటి ప్రపంచములో తోటివారిని అణగద్రొక్కి అభివృద్ధిని సాధించుట పరిపాటి. కానీ మనం తీసుకునే ప్రతి నిర్ణయానికి ప్రతిఫలము ఉంటుంది.    

అబీమెలెకు రాజైన మూడు సంవత్సరాలలో దేవుడు అతనికి మరియు షెకెము వాసులకు మధ్య దురాత్మను పంపెను. అప్పుడు వారు తాము ఎన్నుకున్న నాయకునికి వ్యతిరేకంగా పనిచేయుటకు పూనుకున్నారు. నిలకడలేని మనుష్యులుగా మరొకని నాయకత్వమును కోరుకున్నారు. ఆ వార్త అబీమెలెకునకు తెలియగానే వారిపై పడి వారిని హతమార్చాడు. వారు నాశనమును కొనితెచ్చుకున్నారు.

చాలా సార్లు మనము తీసుకున్న నిర్ణయాలే మనలను ఆయా గమ్యాలకు చేరుస్తాయి. మనం తీసుకునే ప్రతి నిర్ణయం దేవుని వద్ద కనిపెట్టి బహు జాగ్రత్తగా తీసుకోవాలి. మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును (గలతీ 6:7). షెకెమువారు తమ నిర్ణయానికి తామే బలైపోయారు. అబీమెలెకు నిర్ణయానికి అతడు కూడా ఒక స్త్రీ చేత చంపబడ్డారు.

ఒకానొక గ్రామంలో ఒక వ్యవసాయదారుడు ఆదివారం కూడా వ్యవసాయం చేస్తుండేవాడు. అంతేకాకుండా, అటుగా పోయే క్రైస్తవులను చర్చికి వెళ్తున్నందుకు హేళన చేసేవాడు. “వారు ప్రార్ధన చేస్తారు కదా, నా అంత దిగుబడి వారికి వస్తుందేమో చూస్తా.” అనే వాడు. అక్టోబరు నెలలో కోతకాలం వచ్చినప్పుడు, ఆ ప్రాతంలో అందరికంటే అతడికి ఎక్కువ దిగుబడి వచ్చింది. మరుసటి దినం, “చర్చికి వెళ్లి ఏమి ప్రయోజనం? నాకే ఎక్కువ దిగుబడి వచ్చింది” అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అది చూచి బాధపడిన క్రైస్తవులు అలోచించి మరునాడు “దేవుడు తన లెక్కలు చూచేది అక్టోబరు నెలలో కాదు, లెక్కలు చూచే రోజు వేరే ఉంది” అని తిరిగి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారట. నిజమే మనం తీసుకునే నిర్ణయాలకు, చేసే పనులకు మనకు తప్పనిసరి ప్రతిఫలం ఉంటుంది.

ముగింపు:

దేవుడు న్యాయము జరిగించువాడు అను సత్యమును అబీమెలెకు జీవితంలో మనం మరలా చూస్తున్నాము. జీవితంలో పైకి రావడానికి ఇతరులను అణచినప్పుడు, లేదా ఇతరులతో చేతులు కలిపినప్పుడు దేవుడు మనలను చూస్తున్నాడు. మన క్రియలకు మనమే ప్రతిఫలం పొందుకుంటామని జ్ఞాపకముంచుకోవాలి. మనము అన్యాయమునకు గురైనప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా దేవునికి మనలను మనం సమర్పించుకుని నెమ్మదితో అయన కార్యము కొరకు వేచియుండాలి.

Monday, September 21, 2015

దేవుని మట్టపు గుండు



దేవుని మట్టపు గుండు
ఆమోసు 7:7-9; 1 పేతురు 4:12-19
7 మరియు యెహోవా తాను మట్టపుగుండు చేత పట్టు కొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన యొక గోడమీద నిలువబడి ఇట్లు దర్శనరీతిగా నాకు కనుపరచెను. 8 యెహోవా-ఆమోసూ, నీకు కనబడుచున్నదేమని నన్నడుగగా, నాకు మట్టపుగుండు కనబడుచున్నదని నేనంటిని.  అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా నా జనులగు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపుగుండు వేయ బోవుచున్నాను. నేనికను వారిని దాటిపోను 9 ​ఇస్సాకు సంతతివారు ఏర్పరచిన ఉన్నతస్థలములు పాడైపోవును, ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితస్థలములు నాశమగును. నేను ఖడ్గము చేత పట్టుకొని యరొబాము ఇంటివారిమీద పడుదును.

పరిచయము:
ఈ మాటలు రచించినది ఆమోసు. అతని పేరుకు “భారము భరించువాడు” అని భావము. ఎరుషలేమునకు దక్షణాన 16 కి.మీ. దురాన ఉన్న కొండ ప్రాంతములోని తెకోవ అను స్థలమునకు చెందినవాడు. అతడు ఒక పశులకాపరి మాత్రమేగాని వృత్తిరిత్యా ప్రవక్త కాదు. కానీ ఎవ్వరినైనా వాడుకొనే దేవుడు ఇశ్రాయేలుకు తీర్పును ప్రకటించడానికి అమోసును పంపించాడు.

ఇతడు ఉజ్జియా యూదాకు మరియు యెరోబాము ఇశ్రాయేలుకు రాజుగా పరిపాలించిన 8వ శతకములో భూకంపమునకు రెండు సంవత్సరాల పూర్వము ప్రవచించాడు (1:1).

ఉజ్జియా నాయకత్వంలో యుదా, ఎలాతు అనే ఓడరేవు గల పట్టణాన్ని వశపరచుకొని దక్షణమునకు విస్తరించినది. యెరోబాము నాయకత్వంలో ఇశ్రాయేలు ఉత్తరాన ఉన్న సరిహద్దులను స్వాధీనపరచుకొని అంతర్జాతీయ వాణిజ్య రహదారులను హస్తగతం చేసుకుంది.

ఈ రెండు దేశాలు వాటి చరిత్రలోనే రాజకీయ-సైనిక వ్యవస్థలలో తారాస్థాయికి చేరుకున్నాయి. కానీ, విచారకరమైన సంగతి ఏమిటంటే, ఆ దేశాల ఆత్మీయ స్థితి మునుపెన్నడూ లేని అధోగతికి చేరుకుంది. అన్నీ బాగున్నవాడు దేవుడు నాకెందుకు? నేనే దేవుడంతటివాడిని అనుకుంటాడు.

1.      ఇశ్రాయేలు దుస్థితి (2:6-8; 4:4-5; 5:10-11; 8:4-6):
ప్రజలు తమ అభివృద్ధిని దేవుని ఆశీర్వాదముగా భావించారు. కానీ, వారి పాపములకు ప్రతిగా వచ్చుచున్న దేవుని ఉగ్రతను వారు గ్రహించుట లేదు. దేశమంతా విగ్రహారాధన, పేదల అణచివేత, విలాసవంతమైన జీవితం, నీతిమాలిన బ్రతుకులు, అవినీతితో కూడిన న్యాయవ్యవస్థలతో నిండిపోయింది.

యెరోబాము యెహోవా ఆరాధనను ఖండించి ఉత్తరాన దానులో, దక్షణాన బేతెలులో రెండు బంగారపు దూడలను ఉంచెను.
1 రాజులు 12:26-32:- 26 ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కి పోవుచుండినయెడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును; అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబామునొద్ద మరల చేరుదురు; రాజ్యము మరల దావీదు సంతతివారిదగును అని 27 యరొ బాము తన హృదయమందు తలంచి 28 ఆలోచనచేసి రెండు బంగారపు దూడలు చేయించి, జనులను పిలిచియెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము; 29 ఇశ్రా యేలువారలారా, ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పిం చిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును, ఒకటి దానునందును ఉంచెను. 30 దానువరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుటవలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. 31 మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి, లేవీయులు కాని సాధారణమైనవారిలో కొందరిని యాజకులుగా నియ మించెను. 32 మరియు యరొబాము యూదాదేశమందు జరుగు ఉత్సవమువంటి ఉత్సవమును ఎనిమిదవ మాసము పదునైదవ దినమందు జరుప నిర్ణయించి, బలిపీఠముమీద బలులు అర్పించుచు వచ్చెను. ఈ ప్రకారము బేతేలునందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించు చుండెను. మరియు తాను చేయించిన యున్నతమైన స్థలమునకు యాజకులను బేతేలునందుంచెను.

ఆమోసు 2:6-8:- 6 యెహోవా సెలవిచ్చునదేమనగా, ఇశ్రాయేలు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్ప కుండ దానిని శిక్షింతును; ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మి వేయుదురు; పాదరక్షలకొరకై బీదవారిని అమ్మి వేయుదురు. 7 దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు; దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు; తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధనామమును అవమానపరచుదురు; 8 తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరచుకొని బలి పీఠములన్నిటియొద్ద పండుకొందురు. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు.

నేడు ఎక్కడ చూచినా పేదవానికి విలువ లేకుండాపోతుంది. మన క్రింది వారితో ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో దేవుడు చూస్తున్నాడు. వ్యభిచారములో మునిగియున్న క్రైస్తవులను దేవుడు చూస్తున్నాడు. మన అపవిత్రత అంతా ఆయనకు తెలుసు.
2.      దేవుని హెచ్చరిక:
“అతడు ప్రకటించినదేమనగాయెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; కాపరులు సంచరించు మేతభూములు దుఃఖించుచున్నవి, కర్మెలు శిఖరము ఎండి పోవుచున్నది” (1:2).   “యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా?” (3:6). దేవుడు వారిని కరువు, తెగుళ్ళు మరియు ఆస్థినష్టముచే మొత్తినను వారు దేవుని తట్టు తిరుగలేదు (4:6-12).

ఆమోసు 7:7-9:- 7 మరియు యెహోవా తాను మట్టపుగుండు చేత పట్టు కొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన యొక గోడమీద నిలువబడి ఇట్లు దర్శనరీతిగా నాకు కనుపరచెను. 8 యెహోవా-ఆమోసూ, నీకు కనబడుచున్నదేమని నన్నడుగగా, నాకు మట్టపుగుండు కనబడుచున్నదని నేనంటిని.  అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా నా జనులగు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపుగుండు వేయ బోవుచున్నాను. నేనికను వారిని దాటిపోను 9 ​ఇస్సాకు సంతతివారు ఏర్పరచిన ఉన్నతస్థలములు పాడైపోవును, ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితస్థలములు నాశమగును. నేను ఖడ్గము చేత పట్టుకొని యరొబాము ఇంటివారిమీద పడుదును.

ఒక కుటుంబములో లేదా సమాజములో శ్రమ కలిగిన వెంటనే మనలను మనం పరీక్షించుకొనుట అవసరం. దేవుడు మనలను ప్రేమతో హెచ్చరిస్తున్నాడేమో!
కనుక దేవుడు “మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధ పడుడి” (4:12) అని వారిని సవాలు చేస్తున్నాడు.
మనం దేవునిని విడిచిపెట్టినప్పుడు దేవుడు మనలను మరలా తనయొద్దకు రప్పించుకొనుటకు మనలను శిక్షించేవాడు. దేవుడు పరిశుద్ధుడు మరియు తన మట్టపు గుండుతో మనలను సరిచేసేవాడు.
అపొ 11:31-32:- 31 అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పోదుము. 32 మనము తీర్పు పొందినయెడల లోకముతోపాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడు చున్నాము.

 హెచ్చరిక నిర్లక్ష్యము చేసినవాడు తీర్పును ఎదుర్కుంటాడు. ఆ తీర్పు దినం మనం ఊహించినట్లుండదు. అది అంధకారమే గాని వెలుగు కాదు (5:18-20).

మన ఆత్మీయ పరిస్థితి దేవునికి ఇష్టమైనదిగా లేకుంటే, మన భక్తి ఆయనకు హేయమైనదిగా ఉంటుంది.
5:21-23:- 21 మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను; వాటిని నీచముగా ఎంచు చున్నాను; మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రాణింపనొల్లను. 22 నాకు దహనబలులను నైవేద్య ములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను; సమాధాన బలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. 23 మీ పాటల ధ్వని నాయొద్దనుండి తొలగనియ్యుడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సులేదు.
3.      దేవుని పిలుపు:
కానీ, దేవుడు ప్రేమామయుడు కనుక మనలను అనేక మార్లు పిలుస్తాడు. మన జీవితంలోని మూడు విషయాలు సరి చేసుకోమంటాడు.
a.       దేవునితో ఆత్మీయమైన పొత్తు Spiritual Allegiance to God:
నన్నాశ్రయించినయెడల మీరు బ్రదుకుదురు (5:4).
మనం దేవునితో సరియైన సంబంధం కలిగి జీవించాలి. దేవునిపైనే మనం ఆధారపడాలి. దేవునినే ఆరాధించాలి. మన ఆత్మీయ జీవితంలో మరి దేనికి చోటు ఉండ కూడదు.
37 అందు కాయననీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింప వలెననునదియే (మత్త 22:37).

b.      నైతిక విలువలకు కట్టుబడియుండుట Upholding Moral Values:
మీరు బ్రదుకునట్లు కీడు (ద్వేషించి in v.15) విడిచి మేలు వెదకుడి; ఆలాగు చేసినయెడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా మీకు తోడుగానుండును (5:14).
గలతీ 5: 19-22:- 19 శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, 20 విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, 21 భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. 22 అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము.
c.       సామాజిక న్యాయం పెంపొందించుట Exercising Social Justice:
నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనియ్యుడి, గొప్ప ప్రవాహమువలె నీతిని ప్రవహింప నియ్యుడి (5:24).
యాకోబు 2:1-5:- 1 నా సహోదరులారా, మహిమాస్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన విశ్వాసవిషయములో మోమాటముగలవారై యుండకుడి. 2 ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన యొకడు మీ సమాజమందిరములోనికి వచ్చినప్పుడు,మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చినయెడల 3 మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనినవానిని చూచి సన్మానించినీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి, దరిద్రునితోనీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పినయెడల 4 మీ మనస్సులలో భేదములు పెట్టుకొనిమీరు దురాలోచనతో విమర్శచేసినవారగుదురు కారా? 5 నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి; ఈ లోక విషయములో దరిద్రులైనవారిని విశ్వాసమందు భాగ్య వంతులుగాను, తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానముచేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవు డేర్పరచుకొనలేదా?
4.      దేవుని ఆశీర్వాదము:
కొందరు నాకేమి కాదులే అనుకుంటారు. అటువంటి వారికి శ్రమ. కాని, దేవుని తట్టు తిరిగే వారికి మేలు.
9:11-15:- 10 ​ఆ కీడు మనలను తరిమి పట్టదు, మనయొద్దకు రాదు అని నా జనులలో అనుకొను పాపాత్ములందరును ఖడ్గముచేత చత్తురు. 11 పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి, ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులనందరిని నా జనులు స్వతంత్రించుకొనునట్లు 12 పూర్వపురీతిగా దానిని మరల కట్టుదును; ఈలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. 13 రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు; విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్షపండ్లు త్రొక్కువారు వత్తురు; పర్వతములనుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్ని రసధారలగును; ఇదే యెహోవా వాక్కు. 14 మరియు శ్రమనొందుచున్న నా జనులగు ఇశ్రాయేలీయులను నేను చెరలోనుండి రప్పింతును, పాడైన పట్టణములను మరల కట్టుకొని వారు కాపురముందురు, ద్రాక్షతోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములువేసి వాటి పండ్లను తిందురు. 15 వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికిచ్చిన దేశములోనుండి వారు ఇక పెరికివేయ బడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.

ముగింపు:
17 తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చి యున్నది; అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును? 18 మరియు నీతి మంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? 19 కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్‌ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను (1 పేతురు 4:17-19).